తిరుమల ఆలయాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో డ్రోన్ విజ్యువల్స్ ప్రసారం చేసినట్లుగా గుర్తించామనీ, సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్ తో చిత్రీకరించే అవకాశం లేదని అన్నారు. అయితే పాత చిత్రంతో యూనిమేట్ చేశారా అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డ్రోన్ చిత్రాలు, దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని చైర్మన్ వైవీ విజ్ఞప్తి చేశారు.
ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి పశ్చిమ మాడవీధి వరకు దృశ్యాలు చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా చిత్రీకరణ చేశారు. నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమల లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశాన్ని టీటీడీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
డ్రోన్ రైడర్ 1 అనే యూట్యూబ్ ఛానెల్ లో గత ఏడాది నవంబర్ 13న వీడియోను అప్ లోడ్ చేసినట్లుగా ఉండగా, అదే వీడియోను ఐకాన్ ఫాక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఈ నెల ఏడవ తేదీన పోస్ట్ అయినట్లు కనబడుతోంది. అదే వీడియోను గృహ శ్రీనివాస అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశారు.
డ్రోన్ లు ఎవరు ఎగురవేశారు అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఆస్థాన మండపం సమీపంలోని రోడ్లపై నుండి రెండు నెలల క్రితం డ్రోన్లను ఎగురవేసిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. కాకులకోన వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలు తీసేందుకు డ్రోన్ ఆపరేటర్లు అక్కడకు వచ్చినట్లు గుర్తించారు. మూడు నెలల ముందు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ లు చిత్రీకరించారు. దీంతో డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయంపై వెలుగులోకి వచ్చింది.