తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇఓ ధర్మారెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చంద్రమౌళి రెడ్డి (28) బుధవారం కన్నుమూశారు. ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రెపేర్ అవుతున్న చంద్రమౌళి రెడ్డికి రీసెంట్ గా చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తె తో వివాహ నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా, వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు అందజేసేందుకు మూడు రోజుల క్రితం చెన్నైె వెళ్లారు.
అక్కడ కారులో ప్రయాణిస్తుండగా గుండె నొప్పి కారణంగా అస్వస్థతకు గురైయ్యారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడకు చేరుకుని కావేరి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గుండెపోటు వచ్చినట్లుగా గుర్తించిన వైద్యులు మూడు రోజులుగా ఎక్మోపై చికిత్స అందించారు. నిన్న సాయంత్రమే చంద్రమౌళి రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా అయిపోయింది. ఈ ఉదయం చంద్రమౌళి రెడ్డి మరణించినట్లుగా కావేరి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన కుమారుడి మరణంతో ఇటు ధర్మారెడ్డి కుటుంబంలో, అటు వధువు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.