YS Jagan : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, పలువురు వంశపారంపర్య అర్చకులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. పదవీ విరమణ చేసిన అర్చుకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని ఇటీవల టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రమణ దీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. రమణ దీక్షితులతో పాటు తిరిగి విధుల్లోకి చేరిన వంశపారంపర్య హక్కులు కల్గిన అర్చుకులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరించారని కొనియాడారు. ఆలయ అర్చకులకు వంశపారంపర్య హక్కులను తొలగిస్తూ 2018 మే 16న అప్పటి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. దీంతో 65 సంవత్సరాలు నిండిన ప్రధాన అర్చకులు రమణదీక్షితులుతో పాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు 2018 డిసెంబర్ నెలలో తీర్పు ఇచ్చింది. అయితే అప్పటి నుండి ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్ ను రమణదీక్షితులు హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్లి కలిశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన అర్చకుడుగా విధుల్లోకి తీసుకుంటామని రమణ దీక్షితులుకు జగన్ హామీ ఇచ్చారు. 2019 లో జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు రమణ దీక్షితులును టీటీడీ ఆగమ సలహాదారుగా టీటీడీ నియమించింది. తాజాగా ఇటీవల కోర్టు తీర్పును అనుసరించి రమణ దీక్షితులుతో పాటు 14 మంది అర్చకులను విధుల్లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరు సీఎం జగన్ ను కలిసి ధన్యావాదాలు తెలియజేశారు. అర్చకుల సమస్యలను సీఎం జగన్ కు వివరించి పరిష్కరించాలని కోరారు.
Tirumala temple chief priest Dr AV Ramana Deekshitulu has called on @AndhraPradeshCM @ysjagan at camp office here on Tuesday #ysjagan #ttd #AndhraPradesh pic.twitter.com/a19zRi6VEv
— Srihari Pudi (@sreeharipudi) April 6, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?