ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను టిటిడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటి వరకు గోవింద మొబైల్ యాప్ ఉండేదనీ, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుండి అందించవచ్చని తెలిపారు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చనీ, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ ద్వారా చూడవచ్చనీ ఆయన వెల్లడించారు.
తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్లో ఉందనీ, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందనీ ఆయన చెప్పారు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామి వారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని ఆయన చెప్పారు.
భక్తులకు డిజిటల్ గేట్ వే
భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్ గేట్ వేగా ఈ యాప్ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్ అయ్యేందుకు యూజర్ నేమ్తో పాటు ఓటిపి ఎంటర్ చేస్తే చాలనీ, పాస్వర్డ్ అవసరం లేదనీ చెప్పారు. కంప్యూటర్ వాడడం తెలియని వారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్ను రూపొందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్, జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీష్ షా, ఐటి సలహాదారు అమర్, ఐటి జిఎం సందీప్, యాప్ను రూపొందించిన బృందం పాల్గొన్నారు.
Breaking: లోకేష్ పాదయాత్రలో అపశృతి ..సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న