Fire Accident: అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులు సజీవ దహనం కాగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. నర్సీపట్నం కృష్ణాబజారు సెంటర్ గల అంబికా జ్యూవెలర్స్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అంబికా జ్యూవెలర్స్ పై అంతస్తులో షాపు యజమాని మల్లేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగడంతో మల్లేశ్వరరావు, అతని కుమారుడు మౌలేష్ లు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మల్లేశ్వరరావు భార్య సుజాత, కుమార్తె జాహ్నవి గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన సుజాత, జాహ్నవిలను హుటాహుటిన విశాఖ లోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. పాత భవనం కావడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.