కృష్ణాజిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యం కలకలాన్ని రేపింది. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధినులు మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయారు. సాయంత్రానికి విద్యార్ధినులు ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. ఎక్కడా సమాచారం లేకపోవడంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు .. అదృశ్యమైన విద్యార్ధుల్లో ఒక విద్యార్ధిని ఇంటి పక్కనే నివాసం ఉండే గండి జోజి అనే వ్యక్తి వీరికి మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పోలీసులు.. జోజి కోసం వాకబు చేయగా అతను సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్ నుండి జన శతాబ్ది రైలులో చెన్నై వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అదృశ్యమైన బాలికలను రక్షించేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.