తెలంగాణలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే పర్యటించారు. అధికార టీఎస్ఆర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్ల తో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్దం జరుగుతోంది. ఆ వ్యవహారం కొనసాగుతున్న క్రమంలోనే ఇద్దరు కేంద్ర మంత్రులు ఏపి పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ నెల 10,11 తేదీల్లో సామాజిక న్యాయం, సాధికారత శాఖ కేంద్ర మంత్రి నారాయణ స్వామి విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించనుండగా, అదే తేదీల్లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ పవార్ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు.
ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును వీరు పరిశీలించనున్నారు. సామాన్య కార్యకర్త ఇళ్లలో ఈ కేంద్ర మంత్రులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. మండల స్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాలపై వీరు సమీక్ష చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగానే కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. చాలా కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా నేతలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్కిక్కర్ లు వేసుకుని తమ ప్రభుత్వ ఘటనగా చెప్పుకుంటోందని విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణలో కేంద్ర మంత్రులు ప్రస్తావించారు. రేషన్ పంపిణీలో అత్యధిక ఖర్చు కేంద్రం భరిస్తుంటే.. రేషన్ దుకాణాల్లో ప్రధాన మంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించగా, వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో పీఎం ఫోటో ఎందుకు లేదంటూ మరో కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే ప్రశ్నించారు. ఈ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు.
ఇక ఏపిలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు కూడా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ సర్కార్ పై కేంద్ర మంత్రులు విమర్శలు ఎక్కుపెడితే .. వైసీపీ నేతలు అదే ధీటుగా ప్రతి విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే ఏపి విషయానికి వస్తే కేంద్రంలోని పెద్దలు కొంత సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణలోని కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరించే కేంద్రం .. ఏపి విషయంలో కొంత సానుకూల ధోరణినే ప్రదర్శిస్తొంది. ఏపి పర్యటనకు విచ్చేసిన పలువురు కేంద్ర మంత్రులు ఇంతకు ముందు ఏపిలోని పలు పథకాల అమలుతీరును ప్రశంసించారు. రాజకీయ పరమైన మీటింగ్ లలో మాత్రమే కేంద్ర మంత్రులు అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారే కానీ అధికారిక కార్యక్రమాలకు విచ్చేసిన సందర్భాల్లో విమర్శల జోలికి వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు రానున్న కేంద్ర మంత్రులు ఏపి ప్రభుత్వ విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.
సంఘ నేతల బహిష్కరణ పిలుపు బుట్టదాఖలు .. సీఎం జగన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం