Ummareddy Venkateswarlu: వైసీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ పదవి నుండి రిటైర్ అయ్యారు. వాస్తవానికి సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డికి మరో సారి జగన్ ఎక్స్ టెన్షన్ ఇస్తారని అందరూ భావించారు. అయితే వైసీపీలో అనేక మందికి నేతలకు జగన్ గతంలో ఎమ్మెల్సీ హామీలను ఇచ్చి ఉన్నారు. దీంతో ఆ హామీలలో ఒక్కరొక్కరికి అవకాశం కల్పించడం కోసం ఉమ్మారెడ్డి స్థానంలో కాపు కోటా కింద తోట త్రిమూర్తులుకు అవకాశం కల్పించారు వైఎస్ జగన్.
అయితే ఉమ్మారెడ్డికి ఎక్స్ టెన్షన్ ఇవ్వకపోవడానికి వేరే కారణం ఉందని అంటున్నారు. వైఎస్ జగన్ మనసులో ఉమ్మారెడ్డికి మరో కీలక పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారని అందుకే ఎమ్మెల్సీగా మరో సారి అవకాశం ఇవ్వలేదన్న మాట వినబడుతోంది. త్వరలో మరో ఉన్నత పదవి ఆయనను వరించనున్నదని ప్రచారం జరుగుతోంది. ఆయనను త్వరలో పెద్దల సభకు పంపనున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఉమ్మారెడ్డి తొలుత తెలుగుదేశం, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పని చేసి తన సత్తా చాటుకున్నారు. పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
వైసీపీలో చేరిన తరువాత కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహిత నేతలలో ఒకరిగా ఉన్నారు. 2014,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీల్లో ఉమ్మారెడ్డి కీలక భూమికను పోషించారు. జగన్ పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విధానాల కమిటీలోనూ ఉమ్మారెడ్డి ముఖ్య నేతగా పని చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మారెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అని చాలా మంది అనుకున్నారు కానీ ఆ అవకాశం దక్కలేదు. కానీ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి సమర్థవంతంగా బాధ్యతను నిర్వహించారు.
వివాద రహితుడుగా, మేథావిగా పేరున్న ఉమ్మారెడ్డిని రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉండటం వల్ల ఎమ్మెల్సీగా మరో సారి ఎక్స్ టెన్షన్ ఇవ్వలేదనీ, మంత్రివర్గంలోకి తీసుకోలేదని అనుకుంటున్నారు. సామాజిక వర్గ పరంగా చూసుకున్నా ఇప్పటి వరకూ వైసీపీ నుండి రాజ్యసభలో ఎక్కువ మంది రెడ్డి వర్గం నేతలే ఉన్నారు. ఇటీవలే ఇద్దరు బీసీ నేతలను పంపించారు. తరువాత వచ్చే రాజ్యసభ స్థానాన్ని కాపు కోటాలో ఉమ్మారెడ్డిని పంపితే సామాజిక పరంగా న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరో పక్క టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి సైతం రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దల సభకు వైఎస్ జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి మరి.