Undavalli Arun Kumar: జగన్మోహనరెడ్డి సర్కార్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నవరత్న సంక్షేమ పథకాల అమలునకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పులాంధ్ర ప్రదేశ్ గా మార్చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా బీజేపీ, జనసేన, సీపీఐ నేతలు గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు. ప్రభుత్వ అప్పులు రూ.6లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే రాష్ట్రం కోలుకోవడం కష్టమని, దివాళా తీయడం తథ్యమని అభిప్రాయపడ్డారు.
Read More: YS Jagan: ఒక్కోసారి తప్పదు.. “మాట తప్పాలి – మడమ తిప్పాలి”..! జగన్ లో పునరాలోచన..!?
Undavalli Arun Kumar: ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారు అవుతుంటే వంద మందికిపైగా ఉన్న ప్రభుత్వ సలహాదారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే వారంతా ఉండి ఏమి ప్రయోజనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందని ఆరోపించారు. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అప్పుల కోసం ఇచ్చే వెసులుబాటు కోసం వారు పెడుతున్న అన్ని కండిషన్ లకు ఒప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం కేంద్రం పెడుతున్న కండిషన్లను వ్యతిరేకించారన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపి మాత్రం దీనికి ఒప్పుకుందన్నారు.
పోలవరం నిధులపై ఇప్పటికీ లేని స్పష్టత
పోలవరం ప్రాజెక్టుపై వై సీ పీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు కు సంబంధించి రూ.4,068 కోట్ల కు కొర్రీలు వేశారన్నారు. పనులు పూర్తి కాకపోయినా మంత్రులు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందనీ, నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడం లేదన్నారు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకపోవడం దారణమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుండి చర్చ జరుగుతూనే ఉందనీ, నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని ఉండవల్లి అన్నారు.