కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపి సర్కార్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. కేంద్రం సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం (పీఎంజీకేఏవై) పంపిణీ చేయకపోతే ఏపి నుండి బియ్యం సేకరణ నిలిపివేయాల్సి వస్తుందని కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. పీఎంజీకేఏవై కింద కేంద్రం సుమారు 70 శాతం కార్డుదారులకే ఉచిత బియ్యం సరఫరా చేస్తోంది. దీంతో మొత్తం నూరు శాతం కార్డులకు కేంద్రం ద్వారా బియ్యం సరఫరా అయితేనే పంపిణీ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ కారణంగా కేంద్రం ఉచిత బియ్యం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా పంపిణీ చేయలేదు. దీనిపై కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారని ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గతంలో చెప్పారు.
మరో పక్క కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలంటూ ఇటీవల బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర పథకాలను అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఏపీలో పీఎంజీకేఏవై 6వ విడత కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని ఏపి ప్రభుత్వం చెప్పిందన్నారు. 6వ దశ పంపిణీ కింద రాష్ట్రానికి 8.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించడం జరిగిందన్నారు.
కాగా ఇదే అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్సభలో అడిగిన ప్రశ్నకు..పీయూష్ గోయల్ సమాధానం ఇస్తూ ఏపికి గత అయిదు విడతల్లో 23,75,496 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించామని తెలిపారు. ఇప్పటి వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయని విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో ఏపి ప్రభుత్వాన్ని అడిగి సమయంలో తమ వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయనీ, కొన్ని నిర్దిష్టమైన సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైందని చెప్పిందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ప్రభుత్వం చెప్పిందన్నారు మంత్రి పీయూష్ గోయల్.
ఈడీ ఎదుట హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా .. ఢిల్లీలో భారీ బందోబస్తు