Vaccine doubts: దేశంలో కరోనా మహామ్మారి సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న వేళ దీని నియంత్రణకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కొవ్యాక్సిన్ టీకాలు అందుబాటులో ఉండగా తాజాగా రష్యా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వీ వాడకానికి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉధృతం అవుతున్న వేళ చాలా మందిలో అనేక సందేహాలు వస్తున్నాయి. తొలి నుండి వైద్యాధికారులు మొదటి డోస్ ఏదైతే టీకా వేసుకుంటున్నారో రెండవ డోస్ కూడా అదే వేసుకోవాలని సూచిస్తున్నారు. మొదటి సారి కొవ్యాక్సిన్ టీకా వేసుకున్న వారు రెండవ డోస్ వచ్చే సరికి ఆ టీకా అందుబాటులో లేకపోతే కోవిషీల్డ్ ను రెండో డోస్ గా తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమవుతుంది ? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి.
ఇదే విషయంపై రెండు రకాల వ్యాక్సిన్ లు తీసుకుంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అనే దానిపై శాస్త్రవేత్తలకు కూడా అనుమానాలు వేధిస్తున్నాయి. ఈ అనుమానాల నివృత్తి కోసం రెండు రకాల వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఎటువంటి ప్రభావాలు చూపుతాయి అనే దానిపై అధ్యయనాలు చేస్తున్నారుట. రెండు రకాల వ్యాక్సిన్ లు ఇవ్వడం వల్ల శరీరంలో వచ్చే రియాక్షన్లు, రోగ నిరోధక వ్యవస్థ స్పందనలపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారని సమాచారం.
ఇది ఇలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి రెండు రకాల టీకా తీసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాజ్గంజ్ కు చెందిన ఉమేష్ అనే వ్యక్తి పొరబాటున రెండు రకాల టీకాలు తీసుకున్నాడు. స్థానిక చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వద్ద పని చేసే ఉమేష్ మొదటి డోసుగా కోవ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తరువాత పొరబాటున రెండో డోస్ గా కోవిషీల్డ్ టీకా తీసుకున్నాడు. అయితే అతనిలో ఎటువంటి దుష్ప్రభావాలకు లోను కాలేదు. ఈ విషయాన్ని అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే శ్రీవాత్సవ తెలియజేశారు. కానీ సాధ్యమైనంత వరకు తొలి డోసుగా ఏ టీకా అయితే తీసుకుంటారో రెండో డోసుగా ఆ టీకానే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.