Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభిమానులు వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. మరో పక్క వీళ్లను భౌతికంగా లేకుండా చేస్తూ తన వంతుగా రూ.50లక్షలు ఇస్తానంటూ ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వాసు కమ్మ సామాజికవర్గ కార్తీక వనసమారాధనలో ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే మాదిరిగా హైదరాబాద్ ప్రాంతంలోని కమ్మ వన సామారాధనలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలను ఏటువంటి వేడుకల్లో ఆహ్వానించవద్దని, వాళ్లపై కుల బహిష్కరణ చేయాలంటూ నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో నేడు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో వల్లభనేని వంశీ తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఏమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమేననీ పేర్కొన్నారు. టీడీపీలో తనకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి అని, తాను అక్కా అని సంభోదిస్తుంటానని చెప్పారు. ఈ సందర్భంలో భువనేశ్వరికి క్షమాపణలు తెలియజేశారు. కులం నుండి వెలివేస్తారన్న భయంతో క్షమాపణలు చెప్పడం లేదనీ, మాట జారినందుకు మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నానన్నారు. చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు. బెదిరింపులకు భయపడే మనస్థత్వం తమది కాదని వెల్లడించిన వంశీ…నారా లోకేష్ తనపైన, తన కుటుంబ సభ్యులపైనా సోషల్ మీడియా ద్వారా పోస్టింగ్ లు పెడుతుంటే ఎమోషన్ కు గురైనట్లు చెప్పారు. వ్యక్తిగతంగా మీడియా ముఖంగా లోకేష్ కు ఇలా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేయించవద్దని చెప్పినా వినకుండా అదే విధంగా కొనసాగిస్తుండటంతో అలా వ్యాఖ్యలు చేసినట్లు వంశీ చెప్పుకొచ్చారు.