టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానితో నిన్న రాత్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ఉండగా, వసంత నాగేశ్వరరావు అనూహ్యంగా కేశినేని నానిని కలవడం, అంతకు ముందు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసి ఉండటంతో రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది.
నేటి రాజకీయాలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
కేశినేని, వసంత కలయికపై మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. వీరి భేటీపై కేశినేని భవన్ ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ,, వసంత నాగేశ్వరరావు కేశినేని నానిని కలిసి అనేక సామాజిక, రాజకీయ అంశాలను చర్చించడం జరిగిందని పేర్కొంది. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, నిబద్దత, నిజాయితీ కల నాయకుడుగా ప్రజల మన్ననలు పొందిన తీరును వసంత ప్రశంసించినట్లు కేశినేని భవన్ తెలిపింది.
ఈ అంశంపై వసంత నాగేశ్వరరావు కూడా మీడియాకు వివరణ ఇచ్చారు. కేశినేని నాని కుమార్తె వివాహానికి వెళ్లలేకపోవడంతో నిన్న నాని ఇంటికి వెళ్లి కలవడం జరిగిందని తెలిపారు వసంత నాగేశ్వరరావు. ఇదే సందర్భంల గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాల కాపీలను అందజేసినట్లు చెప్పారు. టీడీపీ ఎంపీగా ఉండి కూడా రాజకీయాలకు అతీతంగా తమకు నిధులు కేటాయిస్తామనడం పట్ల గ్రామ ప్రజల తరపున నానికి ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు. కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహం డిసెంబర్ నెలలో హైదరాబాద్ బౌండరీ హిల్స్ లో జరిగిన విషయం తెలిసిందే.
టీడీపీ ఎంపీ కేశినేని నానితో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ..మ్యాటర్ ఏమిటంటే..?