ఏపిలో రాజకీయాల్లో రోజుకో కొత్త అంశం హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అవుతున్నాయి. మొన్న ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన తండ్రి అంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేయడం, దానిపై ఆయన ఖండిస్తూ వీడియో విడుదల చేయడం తెలిసిందే. అంతకు ముందు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ కన్వీనర్ గా వైసీపీ నియమించింది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి మీడియాలో ప్రముఖ వార్తలుగా వస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ సోమవారం విజయవాడలో జరిగింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వెళ్లి సమావేశం కావడం ఒక వైపు టీడీపీ, మరో వైపు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
పర్చూరుకు ఆమంచి.. వెంకటగిరికి నెదురుమల్లి ఇన్ చార్జిలుగా నియమించిన వైసీపీ.. ఆనంపై వేటు
మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వసంత నాగేశ్వరరావు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కాగా ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, తనకు సంబంధం లేదని చెప్పుకున్నారు. కమ్మ సామాజికవర్గానికి ప్రస్తుత జగన్ కేబినెట్ లో చోటు లేకపోవడంపై వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా వైసీపీ, ప్రభుత్వ స్టాండ్ కు భిన్నంగా అమరావతే రాజధానిగా ఉండటం బెటర్ అంటూ వసంత నాగేశ్వరరావు మాట్లాడారు. వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన కుమారుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు పార్టీలో ఇబ్బంది కలిగే విధంగా మారడంతో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఇప్పటికే మైలవరం నియోజకవర్గ వైసీపీలో మంత్రి జోగి రమేష్ వర్గం..ఎమ్మెల్యే వసంత వర్గాల మద్య విభేదాలు ఉన్నాయి. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత మధ్య ఉన్న విభేదాల అంశం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి కూడా వెళ్లింది. ఇటీవల మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమావేశం నిర్వహించిన సందర్భంలో ఆ అంశంపైనా జగన్ మాట్లాడారు. సమావేశం అనంతరం వసంత కీలక కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడానికి సిద్దమంటూ ప్రకటించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
మైలవరం వైసీపీలో ఇలా విభేదాల రాజకీయం కొనసాగుతున్న వేళ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు నేరుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి వెళ్లడం, ఆయనతో సమావేశం కావడం ఉమ్మడి కృష్ణాజిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కాంగ్రెస్, మళ్లీ టీడీపీలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సీనియర్ నేత అయిన వసంత నాగేశ్వరరావుకు వివిధ రాజకీయ పార్టీలలో ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలువురు టీడీపీ నేతలతో బంధుత్వాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేశినేనితో వసంత భేటీ కావడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా లేదా వ్యక్తిగతమా అనేది తెలియాల్సి ఉంది. కేశినేనితో వసంత కుటుంబానికి గతం నుండే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరో పక్క కేశినేని నాని కూడా టీడీపీ అధిష్టాన వైఖరిపై కొంత అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. నాని సోదరుడు కేశినేని చిన్ని రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ కూడా ఆయనకు సహకారం అందిస్తొందన్న భావన నానిలో ఉంది. ప్రభుత్వంపై అసంతృప్తి గళం విప్పిన వసంత నాగేశ్వరరావు..టీడీపీలో అసంతృప్తితో ఉన్నట్లుగా భావిస్తున్న కేశినేని నానితో భేటీ కావడంపై రకరకాల ఊహానాగాలు సెర్క్యులేట్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది.
తెరపైకి మేకపాటి శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి .. ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబంలో కొనసాగుతున్న వివాదం