Vellampalli Srinivas: ఏపిలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. తెలంగాణలో లేని ఆంక్షలు ఆంధ్రాలో ఎందుకు అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇతర మతస్తులకు ఒక న్యాయం, హిందువులకు మరో న్యాయమా అంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ నాయకులు మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అన్నారు. పండుగలకు కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
కులమతాలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ పాలన చేస్తున్నారని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి..బీజేపీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలో ఆలయాలను కూల్చిన టీడీపీ ప్రశ్నించే వారని అన్నారు. వినాయక చవితి అందరి పండుగ, అందరూ చేసుకోవచ్చు. ఇళ్లల్లో, దేవాలయాల్లోనూ చేసుకోవచ్చని అన్నారు మంత్రి వెల్లంపల్లి. అయితే పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెట్టి ఊరేగింపులు, భారీ ఎత్తున వేలు, లక్షల మందితో ఊరేగింపులు, హంగామాలు, ఆర్భాటాలు చేయడం వద్దని మాత్రమే చెప్పామని అన్నారు. పొరుగున బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలు విధించిందని మంత్రి వెల్లంపల్లి గుర్తు చేశారు. కోవిడ్ నేపథ్యంలో కుంభమేళాకు అనుమతిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందేనని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.