VH Hanumanth Rao : ఏపి టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి పై మాజీ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఇటీవల జెసీ తెలంగాణ సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలోని పాత మిత్రులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులను కలిశారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే జెసి వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ తీవ్రంగా ఖండించారు. జేసీ సరదా సంభాషణ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరి కాంగ్రెస్ ను నాశనం చేశారని వ్యాఖ్యానించడం బాధాకరమని నిరంజన్ అన్నారు. తాజాగా జేసీపీ వీహెచ్ సీరియస్ అయ్యారు.
కాంగ్రేస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై జేసి వ్యాఖ్యలు చేయడంపై వీహెచ్ మండిపడ్డారు. జేసీ తన రాజకీయాలను ఆంధ్రాలో చూసుకోవాలి, తెలంగాణలో కాదంటూ విమర్శించారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారు అని చెప్పడానికి జెసి ఎవరు అని విహెచ్ ప్రశ్నించారు. జేసీ జోతిష్యాలు చెప్పడం మానుకోవాలని వీహెచ్ హితవుపలికారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని వీహెచ్ హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసిఆర్ కు కోవర్ట్ అని అర్థం అవుతోందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. జేసి తన రాజకీయ బలాన్ని జగన్ పైన చూపుకోవాలని వీహెచ్ సూచించారు.
కాగా భట్టి, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలపై పార్టీ అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సీఎల్పీలో కూర్చుని జేసీ కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వీరు అడ్డుకోలేదంటూ విమర్శించారు. జానారెడ్డి ఓడి పోతారని జేసి చెప్పినా ఈ నేతలు స్పందించరా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.