vigilance and enforcement: కరోనా విజృంభిస్తున్న వేళ బాధితుల అవసరం, అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి తెరితీశాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందించాల్సి ఉన్నా వేలకువేలు డబ్బు వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కరోనా ఇంజక్షన్ లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కరోనా రోగుల పట్ల దోపిడీకి పాల్పడే వారిని ఊపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేయతో
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ వివిధ జిల్లాల్లో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొత్తం 32 ఆసుపత్రులలో తమ బృందాలు తనిఖీ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. తొమ్మిది ఆసుపత్రుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఆసుపత్రుల యజామాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్య శ్రీ ఉన్నా దాని ద్వారా చికిత్స చేయకుండా డబ్బులు కట్టించుకోవడం, రెమిడిస్ వర్ ఇంజక్షన్ల దుర్వినియోగం అధికారుల తనిఖీల్లో గుర్తించారు. విజయనగరం, ప్రకాశం, నెల్లూరు. కర్నూలు, చిత్తూరు, గుంటూరు, అనంతపుర్, కడప జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయగా, అనంతపుర్ ఎస్వి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ, కడపలోని కెసిహెచ్ ఆసుపత్రి ప్రతినిధి ఒకరిని అరెస్టు చేశారు.