Vijaya Sai Reddy: గత కొద్ది రోజులుగా వైసీపీ – బీజేపీ రహస్య బంధంపై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏపిలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శల మాటల యుద్ధం నడుస్తుంది. మరో పక్క ఢిల్లీ స్థాయిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిఏసి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీతో వైసీపీకి రహస్య సంబంధం ఉందనీ, రాష్ట్రంలో ప్రధాన అంశాలపై నుండి దృష్టి మళ్లించేందుకే వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేయడం, మరో పక్క దీనికి బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం చూస్తున్నాం. ఏపి బీజేపీ కూడా ఇటీవలే వైసీపీతో పొత్తు ప్రశక్తే లేదంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఏ పార్టీతోనూ చీకటి స్నేహాలు ఉండవని స్పష్టం చేశారు. నిజంగా కలిసి పని చేయాల్సి వస్తే మా అధినేత జగన్ గారు బహిరంగంగానే ప్రకటిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబులా అర్ధరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకోవడాలు, చాటు మాటు స్నేహాలు, రహస్య సంసారాలు తమకు ఉండవని అన్నారు. విలువల పునాదిపై వెలిసిన పార్టీ వైసీపీ అంటూ విజయసాయి పేర్కొన్నారు.