Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీలో నెంబర్ 2 గా కీలక పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇటీవల కాలంలో ఆయనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లు అయ్యింది. విజయసాయ రెడ్డి ఇటీవల కొద్ది రోజుల పాటు ఢిల్లీ (Delhi)లో మకాం వేయడంతో ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతల నుండి సీఎం జగన్ తప్పిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనీ ప్రచారం జరిగింది. ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గించారా అనే అనుమానాలు షికారు చేశాయి. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్ చార్జి తానే అనే విధంగా ఒ కీలక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తున్నారు.
Vijaya Sai Reddy: వారంలో అయిదు రోజులు ప్రజాదర్బార్..
ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు విజయసాయి రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారంలో అయిదు రోజుల పాటు ఈ ప్రజా దర్బాద్ కొనసాగుతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకూ ప్రజా దర్బార్ లో విజయసాయి రెడ్డి ప్రజలను నేరుగా కలుసుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రజలు ఆయనను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ పట్టణానికి చెందిన వారే కాకుండా ఉత్తరాంధ్ర కు చెందిన వారంతా కలిసి తమ సమస్యలను ఆయనకు చెప్పుకోవచ్చు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు విజయసాయి కృషి చేస్తున్నారు. విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన కనబడుతోంది.
విశాఖలోనే నివాసం
నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి విశాఖలో శాశ్వత నివాసితులుగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల స్పష్టం చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది పూర్తి అవుతుంది. అయితే 2024 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అలోచన ఉందని భావిస్తున్నారు. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విశాఖ పై కాన్సట్రేషన్ చేస్తున్నారని సమాచారం. దాదాపు ఆరు సంవత్సరాల నుండి విశాఖలోనే విజయసాయి రెడ్డి ఉంటున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా విశాఖలో పార్టీ బలోపేతానికి విజయసాయి రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వదంతులకు చెక్.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం అయుదుగురు మంత్రులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, ఝక్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, అప్పలరాజు లు ఉన్నారు. ప్రస్తుతం వీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే మంత్రుల వద్దకు వెళ్లి సమస్యలు విన్నవించుకోలేని వారు ప్రజాదర్బార్ లో విజయసాయిని కలిసి సమస్యలపై విజ్ఞాపనలు ఇస్తున్నారు. తాజాగా విజయసాయి ప్రజా దర్బార్ నిర్వహిస్తుండటంతో ఇప్పటి వరకూ ఆయనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లు అయ్యింది. రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ కు పోటీ చేయాలని విజయసాయి ఆలోచన చేస్తున్నారా అనేది త్వరలో తేలనుంది.