Vijaya Sai Reddy: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజును చైర్మన్ పదవిని తప్పించి ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించగా సంచయిత గజపతిరాజు నియామకాన్ని కొట్టేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. దీంతో అశోక్ గజపతిరాజు తిరిగి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సంచయత గజపతిరాజు సవాల్ చేశారు. ఇదిలా ఉంటే అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు.
తాగా చంద్రబాబు, అశోక్ గజపతి స్నేహంపై విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ భూములకు సంబంధించిన విషయంలో చంద్రబాబు, అశోక్ గజపతి రాజు మధ్య డీల్ కుదిరిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రస్ట్ భూములు అమ్మేసి చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు కప్పం కట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. “భూముల్ని అమ్మేసి పచ్చ బాస్ కు కప్పం కట్టేశాడు. చివరికి అధికారులను బలిపశువులను చేశాడు. అన్నీ తనకు తెలియాలంటూ హుకుం జారీచేసే పూసపాటి అశోక్ 862 ఎకరాల సింహాచలం భూ”మాయ”లో మీ పాత్ర లేదా? సిగ్గుంటే నైతిక బాధ్యత వహించి ఛైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకో” అంటూ విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతిరాజు చైర్మన్ గా తిరిగి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజుపై ఈ విధంగా విమర్శలు చేయడం తగదంటూ ఏపి తెలంగాణ క్షత్రియ సమాజం, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తదితర ప్రముఖులు విజ్ఞఫ్తి చేసినా విజయసాయిరెడ్డి మాత్రం తన విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. విజయసాయి వ్యాఖ్యలపై అశోక్ గజపతిరాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.