Vijaya Sai Reddy: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. భూ కుంభకోణం జరిగిందని తొలి నుండి విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు జైలుకు వెళ్లడం ఖాయం అని కూడా విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో సారి విజయసాయి రెడ్డి సింహాచలం భూముల విషయంపై మాట్లాడారు.
శుక్రవారం ఆయన సింహాచలం అప్పన్న స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ లో చాలా అవినీతి జరిగిందని పునరుద్ఘాటించారు. దీనిపై టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తో చర్చకు సిద్ధమని ప్రకటించారు. మాన్సాస్ ట్రస్ట్ లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతుందని ఆయన అన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ ఆక్రమణ లో ఎవరు చేశారో విచారణలో బయట పడుతుందని అన్నారు.
విజయ సాయి రెడ్డి. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనపై విజయసాయిరెడ్డి తరచూ సంచలన ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు పై విజయసాయి చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై వివిధ వర్గాల నుండి ఆక్షేపణ లు వ్యక్తం అవుతున్నా విజయసాయి తన పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం ఈ విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్షత్రియ సామాజిక వర్గం ప్రముఖులు అశోక్ గజపతి రాజు పై చేస్తున్న ఆరోపణలను ఖండించారు.