Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి పార్లమెంటు కేంద్రంగా చేసిన రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ తొలిరోజే రాజ్యసభలో వెల్లోకి దూసుకెళ్ళారు. సభలో విజయసాయి రెడ్డితోపాటు ఇతర పార్టీ సభ్యులు వెల్లో ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధానమంత్రి మౌనంగా వారిని వీక్షిస్తూ కనిపించారు. అయితే, ఇది జరిగిన కొద్దిసేపటికే అదే రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయసాయిరెడ్డిని ప్రశంసించడం గమనార్హం.
Read More: Modi: ఓ రికార్డు… ఓ నిరసన.. రెండూ మోడీ పెట్రోల్ ధరల మహిమేనట!
ముందు ఇలా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏడేళ్ళు కావస్తున్నా అమలుకు నోచుకోనందున రాజ్యసభలో ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేసి ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు రూల్ 267 కింద విజయసాయి రెడ్డి నోటీసును అందించారు. అయితే ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నట్లుగా సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ప్రకటించడంతో విజయసాయి రెడ్డి సభలోని వెల్లోకి దూసుకువెళ్ళారు. ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీ సభ్యులు సైతం వెల్లోకి చేరుకొని నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ అధ్యక్షులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ ఈ రోజు చర్చకు అనుమతించలేనని తెలిపారు.
Read More: Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
కాసేపటికే వెంకయ్య ప్రశంసలు…
మరోవైపు ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ ఈ రోజు రాజ్యసభలో చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. పార్లమెంట్ సమావేశాల విరామ కాలంలో వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన కామర్స్ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు. పార్లమెంట్ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపిందని చైర్మన్ తెలిపారు. కమిటీ మొత్తం జరిపిన సమావేశాలలో 31 శాతం ఈ కాలవ్యవధిలోనే నిర్వహించడం పట్ల ఆయన కమిటీ చైర్మన్, సభ్యులను ఆయన అభినందించారు. కాగా, సభ వేదికగాఇటు నిరసనలు, అటు ప్రశంసలు పొందడం విజయసాయిరెడ్డికే చెందిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.