Vijayasai Reddy : రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ వర్గాల్లో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా జోక్యం చేసుకుని విజయసాయిరెడ్డి తీరును తప్పుబట్టినట్లు తెలిసింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ వెంకయ్య నాయడుకి విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిని అగౌరవపరచాలనుకోలేదని, అవేశంతో మాట్లాడినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూసుకుంటానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
నిన్న రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడును ఉద్దేశించి విజయసాయి రెడ్డి “మీ మనసు, ఆత్మ బీజెపీ పైన, తనవు టీడీపీపైన” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపక్ష సభ్యులు తప్పుబట్టారు. విజయసాయి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుడు జై రాం రమేష్,, బీజెడీ సభ్యుడు ప్రసన్న ఆచార్య తదితరులు తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ కోరారు. చివరకు కేంద్ర మంత్రి ప్లహ్లద్ జోషి మందలింపు తరువాత నేటి సభలో విజయసాయి రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.