Vijayawada : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా అక్కడడక్కడా వ్యాక్సిన్ తీసుకున్న పలువురు అస్వస్థతకు గురి అవుతున్నారు. కొందరు ఒకటి రెండు రోజుల్లో చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారు కోలుకోవడానికి వారం పది రోజులు పడుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అయిదుగురు ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయినా వారి మరణాలకు వ్యాక్సిన్ దుష్ప్రభావం కారణం కాదంటూ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత మృతి చెందిన వారికి రూ.50లక్షల వరకూ ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు చేస్తోంది. ఇటీవల కడప, అంతకు ముందు గుంటూరు జిల్లాలో ఆరోగ్య కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ మృతి చెందిన ఘటనలు మరవక ముందు తాజాగా విజయవాడలో ఓ అంగన్ వాడీ ఆయా మృతి చెందింది. ఆమె మృతికి వ్యాక్సిన్ దుష్ట్రభావమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విజయవాడ సనత్ నగర్ లో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వికటించి ఓ అంగన్ వాడీ ఆయా మృతి చెందింది. స్థానిక అంగన్ వాడీ సెంటర్ లో ఆయా పని చేసే బుల్ షాద్ బేగం (32) గత నెల కరోనా మొదటి డోస్ వేయించుకున్నది. ఈ నెల 20వ తేదీ రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉండగా ఆ రోజు వీలు కుదరక ఈ నెల 24వ తేదీన కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకుంది. ఆ మరుసటి రోజు నుండి ఆమె అస్వస్థతకు గురైంది. ఆమెతో వ్యాక్సిన్ వేయించుకున్న వారు అందరూ సాధారణ ఒళ్లు నొప్పులు వచ్చి పోయాయని అంటున్నారు.
బుల్ షాద్ బేగంకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదనీ, తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు రాకపోవడంతో ధైర్యంగా వెళ్లి రెండవ డోస్ వేయించుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేయాలని స్థానిక నేతలు, బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మైనార్టీ ముస్లిం సంప్రదాయ నేపథ్యంలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి తొలుత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా వ్యాక్సిన్ వల్ల మృతి చెందిందో లేదో తెలుసుకోవాలంటే పోస్టుమార్టం తప్పనిసరి అని స్థానిక నేతలు కుటుంబ సభ్యులను ఒప్పించారు.