విజయవాడ కనకదుర్గగుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసులో దొంగను ఎట్టకేలకు విజయవాడ వెస్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కేసు దర్యాప్తు జరుగుతుండగా మిస్టరీని ఛేదించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వెండి సింహాల విగ్రహాలు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 17న ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు బృందాలను రంగంలోకి దింపింది. శనివారం విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు 140 మందిని విచారించడం జరిగిందన్నారు. చోరీ ఎప్పుడు జరిగిందో కశ్చితంగా తెలియకపోవడం, అధారాలు లభించకపోవడం, సీసీ టీవీ పుటేజ్ 15 రోజులకు మించి అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు కొంత క్లిష్టంగా మారిందన్నారు. అనేక మంది పాత నేరస్తులను విచారించిన సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి సాయిబాబా ఈ వెండి సింహాల ప్రతిమలను అపహరించినట్లు గుర్తించామన్నారు. దొంగిలించిన ఈ వెండి ప్రతిమలను తణుకు తీసుకువెళ్లి బంగారు వ్యాపారి ముత్తు కమలేష్ అనే వ్యాపారికి విక్రయించాడన్నారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 9 కిలోల వెండితో సహా మొత్తం 15.4 కిలోల వెెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో దేవాలయాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామన్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం కీలకమని అన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాలపై ప్రజలు, రాజకీయ పార్టీ ల నాయకులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ చోరీ కేసు చేధించిన ఏసీపీ హనుమంతరావు, సీఐ పి వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లకు రివార్డు లు అందిస్తున్నట్లు సీపీ తెలిపారు.