వైయస్అర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర కేంద్రంగా గత కొద్దిరోజులుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అక్కడ పరిపాలన రాజధానిని తీసుకురానుందనే ప్రతిపాదన విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవలే విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. వరలో విశాఖ లో పరిపాలన రాజధాని ఏర్పాటు కాబోతున్న తరుణంలో కార్యాలయాలకు కేవలం ప్రభుత్వ భూములు ఉపయోగించుకోవాలని నిర్ణయించామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం రాజధానిపై ముందడుగు వేయడం తప్ప మరో ఆలోచనే లేదన్న భావన కల్పించారు. అయితే, తాజాగా ఆయన ఓ సంచలన పత్రిక ప్రకటన విడుదల చేసారు.
వెలగపూడి రామకృష్ణపై సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం చేస్తానని సవాల్ విసిరినట్టుగా మీడియాలో చూశాను. రామకృష్ణ తామంతా కలిసి చంపేసిన వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడు, చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ మీద అయినా ప్రమాణం చేయగలడు, తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలడు, తన పిల్లల మీద అయినా ప్రమాణం చేయగలడు. ఎందుకంటే, దేవుడు అంటే నమ్మకం లేదు, పాప భీతి లేదు కాబట్టే “ అంటూ విరుచుకుపడ్డారు.
వంగవీటిని హత్య చేసి….
వంగవీటి హత్య తర్వాత వెలగపూడి రామకృష్ణ విశాఖకు పారిపోయి వచ్చాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. “విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే.. భూములు మేశాడు, పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు. ఈయనకు బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తాడా..?, బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపాటుకు గురి అవుతున్నాడు, ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్టు బాధపడుతున్నాడు?. తనకు ఒక్క అంగుళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నాడు?. ఈ విషయాలన్నింటికీ అతనే సమాధానం చెప్పాలి. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా లేక ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా… అని ప్రశ్నించాడు. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడి మీద ప్రమాణం చేయటం ఏమిటి? వినటానికి కూడా వెగటుగా ఉంది“ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలపై వెలగపూడి రామకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో మరి!