Visakha: ఏపి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇంకా కోర్టు సమీక్షలో నలుగుతూనే ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టే కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి ప్రాంతం నుండి తరలించడానికి వీలులేదంటూ ఓ పక్క ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో పక్క మంత్రి బొత్సా సత్యనారాయణ, వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి తదితర వైసీపీ నేతలు త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమంటూ చెప్పుకొస్తునే ఉన్నారు.
ఈ తరుణంలోనే విశాఖ నుండి భీమిలి – భోగాపురం వరకూ తీర ప్రాంతాన్ని వేర్వేరు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశాఖ బీచ్ రోడ్ కారిడార్ కార్పోరేషన్ పేరిట ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పర్యాటక, వాణిజ్య, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను విశాఖ బీచ్ రోడ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం 570 ఎకరాల్లో రూ.1021 కోట్లతో విశాఖ బీచ్ రోడ్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. బీచ్ రోడ్ లో రిసార్టులు, గోల్ఫ్ కోర్సులు, కైలాసగిరి వద్ద ఫ్లోటింగ్ షిప్ రెస్టారెంట్ తదితర ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ విశాఖ రాష్ట్ర పరిపాలనా రాజధాని అయిపోయినట్లుగా (డిక్లేర్) ఉంది. “రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు” అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖ అని విజయసాయి సంభోధించడంపై నెటిజన్ల నుండి విమర్శలు వస్తున్నాయి. విజయసాయి ట్వీట్ లకు నెటిజన్ ల నుండి వ్యతిరేక కామెంట్స్ ఎక్కువగా వస్తున్నా అవేమి పట్టించుకోకుండా తనదైన ఫందానే కొనసాగిస్తుండటం విమర్శలకు దారి తీస్తున్నది.
రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకూ 570 ఎకరాల్లో రూ.1,021 కోట్ల వ్యయంతో విశాఖ బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంకల్పించారు. pic.twitter.com/8Aaj4IZwtD
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 23, 2021