Visakha Garjana: మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తున్న విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అధికార వైసీపీ గర్జన ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుండి గర్జన ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా మొదలైంది. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో ర్యాలీ సంగడిగా మారింది.
అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ గర్జన ర్యాలీ సెవెన్ హిల్స్ జంక్షన్ మీదుగా పార్క్ హోటల్ జంక్షన్ కు చేరుకుంటుంది. మూడున్నర కిలో మీటర్లు ర్యాలీ సాగుతుంది. అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ విగ్రహాల వద్ద బహిరంగ వేదిక వద్దకు చేరుకున్న తర్వాత బహిరంగ సభలో నేతలు ప్రసంగిస్తారు. ర్యాలీలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాథ్, ఆర్కే రోజా, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జోగి, రమేష్, విడతల రజిని తదితర మంత్రులతో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కృష్ణదాసు తదితర వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు , మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్ధులు, డ్వాక్రా మహిళలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు.
గర్జన నేపథ్యంలో ర్యాలీ పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డప్పు కళాకారులు, నృత్యాలతో ర్యాలీ సందడిగా సాాగుతోంది. విశాఖ గర్జన దృష్య్యా నగరంలో పలు చోట్ల ట్రాపిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహం నుండి పార్క్ హోటల్ వరకూ వాహనాలను అనుమతించడం లేదు. రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణీకులు అసిల్ మెట్ట ఫ్లై ఓవర్ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.