Janasena: మూడు రోజుల పర్యనట నిమిత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు నిన్న విచ్చేయడం, విమానాశ్రయం వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. మంత్రులు, వైసీపీ కీలక నేతల కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద శనివారం అర్ధరాత్రి పలువురు జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మరో పక్క ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గోబ్యాక్, ఉత్తరాంధ్ర ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. జనసేన జనవాణి అడ్డుకుట్టామంటూ ప్రకటించారు. ఈ పరిణామాలతో విశాఖలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇదే క్రమంలో తమ పార్టీ నేతలను అరెస్టు చేసే వరకూ జనవాణి కార్యక్రమం నిర్వహించనంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హోటల్ లోనే ముఖ్యనేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్ కు 41 ఏ నోటీసు జారీ చేశారు. సాయంత్రం నాలుగు గంటల లోపు విశాఖ విడిచి వెళ్లాలంటూ విశాఖ పోలీసులు ఆదేశించారు. విశాఖలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయనను సాయంత్రం నాలుగు గంటల లోగా విశాఖ విడిచి పెట్టి వెళ్లాలంటూ నోటీసులో పేర్కొన్నారు.
అయితే తొలుత నోటీసులు తీసుకునే విషయంలో జనసేన నేతలు, పోలీసులకు మద్య కొంత సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీస్ అధికారులు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నోటీసులు జారీ చేస్తున్నామని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల నోటీసులపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇంత వరకూ వెల్లడికాలేదు. అంతకు ముందు మీడియా సమావేశంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Breaking: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం .. విశాఖ జనవాణి వాయిదా