Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న ఉక్కు ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖలో భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగనంపూడి నుండి అక్కిరెడ్డిపాలెం వరకు పది కిలో మీటర్లు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల కుటుంబాలు, నగర వాసులు పాల్గొన్నారు. మానవహారం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.
Visakha Steel Plant: ఎంపికి పరాభవం..
అయితే కార్మికులు చేపట్టిన మానవహారంలో సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన వైసీపీ ఎంపి ఎంవివి సత్యనారాయణ కు కార్మికుల నుండి నిరసన వ్యక్తం అయ్యింది. ఎంపి పదవికి రాజీనామా చేసి కార్మికుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఎంపికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేయడంతో ఆయన అక్కడ నుండి వెళ్లి పోయారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం కావాలనే నష్టాల బాటలో నడుపుతోందని ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.