Visakha Steel Plant: ఏపి రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక అంశాల్లో విమర్శల పాలవుతున్నారు. జనాల ముందు ఆవేశ పూరిత ప్రసంగాలు చేస్తారు. ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేస్తుంటారు. ఆ తరువాత వాటిని మరచిపోతుంటారు. గతంలో జరిగింది. ఇప్పుడూ జరుగుతూనే ఉంది. ఓ పక్క సినీ షూటింగ్ లలో బిజీగా ఉంటూ మరో పక్క రాజకీయాలు చేస్తుండటంతో పూర్తి స్థాయి పొలిటీషియన్ గా రాణించలేకపోతున్నారన్న మాట వినబడుతోంది. ఇంతకు ముందు అమరావతి అంశంపై బీజేపీతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఊసే మరచిపోయారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ నిలకడలేని మాటలు మాట్లాడుతుంటారని విమర్శించారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఈ నెల మొదటి వారంలో పవన్ కళ్యాణ్ స్పందించారు.

Read More: Pawan Kalyan: జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..!!
Visakha Steel Plant: ఆందోళనకు సంఘీభావం తెలిపి…
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఓ పక్క కేంద్ర బీజేపీతో దోస్తీ చేస్తూనే మరో పక్క ఇక్కడకు వచ్చి కార్మికుల పక్షాన పవన్ కళ్యాణ్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో దోషి కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్రాన్ని విమర్శించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ నిందించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. వారం రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాను, ఈ లోపు ప్రభుత్వం స్పందించాలి లేకుంటే తాను కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ అల్టిమేటమ్ జారీ చేసి మూడు వారాలు దాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేదు. అటు ఆయన వైపు నుండి ఇంత వరకూ రెస్పాన్స్ రాలేదు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నేత ఇలా ప్రకటనలు ఇచ్చి ఆ తరువాత వాటిని విస్మరించడం ఏమిటి అన్న ప్రశ్న ఆ వర్గాల నుండి వ్యక్తం అవుతోంది. దేశ రాజధానిలో అప్రతిహతంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాల విషయంలో వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పోేరాటం సాగించి ప్రైవేటీకరణను నిలుపుదల చేయించేందుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా రాజకీయ పార్టీల నేతలు ఉద్యమించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.