Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళనలకు బీజేపీ మినహా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమానికి అటు తెలంగాణ అధికార పక్షం నుండి మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి రెండు లేఖలు రాశారు. అయినప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత, పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ లేఖ రాశారు.
ఈ విషయంపై శుక్రవారం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వెనక అనేక మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయన్నారు. విశాఖ ఉక్కు ..ఆంధ్రుల గుండె చప్పుడని అన్నారు. తమ చిన్న తనంలోనే విశాఖ ఉక్కు పోరాటం గురించి చర్చించుకుంటుంటే విన్నామన్నారు. టీమ్ ఇండియా క్రికెట్ లో గెలిస్తే దేశం గెలిచిందని సంబరాలు చేసుకుంటామనీ, అలానే ఉక్కు కర్మాగారం కేంద్రం పరిధిలో ఉంటే మన అందరికీ గర్వకారణమని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇతర సంస్థలతో పాటు చూడకుండా కొన్ని చర్యలతో మళ్లీ గాడిలో పెట్టవచ్చని ఆయన అన్నారు. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేకత విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉందని పేర్కొన్నారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంటేననీ, ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనని అన్నారు.
రానున్న రోజుల్లో స్టీల్ కు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా స్పష్టం చేశారన్నారు. ప్రస్తుతం ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానంలో ఉందన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరలు కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో స్టీల్ కొనడం కష్టంగా మారుతుందని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహానికి 3200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2200 టన్నుల స్టీల్ ను విశాఖ నుండే పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ మిగిలిన స్టీల్ కంటే విశాఖ స్టీల్ నాణ్యమైనదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందకు గానూ పలు ప్రధానమైన సూచనలు చేస్తూ ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.