Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన సీఎం వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘం నేతలు భేటీ అయ్యారు. ఎన్ఎండీసీతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను అనుసంధానం చేస్తే సొంత గనుల సమస్య తీరుతుందని సంఘ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ప్రధాన డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖలోకి అడుగు పెట్టనివ్వనని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. పోస్కో పరిశ్రమను భావనపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని తెలిపారని అన్నారు.
ముందుగా కార్మిక సంఘాల నేతలు విశాఖ పర్యటనకు విచ్చేస్తున్న సీఎం జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు గంట సేపు కార్మిక సంఘాల నేతలతో జగన్ మాట్లాడారు. రేపు జరిగే విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవస్థాపక దినోత్సవాన్ని విశాఖ పరిరక్షణ దినోత్సవంగా జరిపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.