Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు కార్మికుల ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్రం నుండే కాక పక్క రాష్ట్రం తెలంగాణ నుండి మద్దతు లభిస్తోంది. ఇంతకు ముందే తెలంగాణ సీఎం కేసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెెంట్ కేటిఆర్ తదితరులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. తాజాగా నేడు తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు విశాఖలో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు.
అయితే ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్ లు విసిరారు. కేంద్రంలోని బీజేపిీ ఏపి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు విశాఖ ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తున్నది. ఇప్పుడు కూడా వకీల్ సాబ్ ఆ బీజేపీ దోస్తాన్ చేస్తే ఎలా, బయటకు వచ్చి కార్మికుల పక్షాన పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పవన్ కాపాడాలని అన్నారు. బీజేపీని నమ్ముకుంటే వాళ్లు ఇచ్చేది ఓ నిక్కర్, చేతిలో కత్తి మాత్రమేనంటూ సెటైర్ వేశారు. వకీల్ సాబ్ కు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది ఆయన బీజేపీ నుండి బయటకు వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన పోరాటం సాగించాలని విజ్ఞప్తి చేశారు. వీహెచ్ తన దైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్మికుల ఉద్యమానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోడీ అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. కాగా .వీహేచ్ వ్యాఖ్యలపై వకీల్ సాబ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.