Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్మికులు నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేస్తున్నాయి. మేధావి వర్గాలు విశాఖ ఉద్యమానికి సై అంటున్నాయి. స్టీల్ ప్లాంట్ అంశంపై సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఇటీవల ప్రధాన మంత్రి మోడి లేఖ రాశారు. విశాఖలో జరిగే కార్మికుల ఉద్యమంలో జేడీ పాల్గొంటున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మీనారాయణలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జేడీ లక్ష్మీనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తుతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన జేడీ లక్ష్మీనారాయణపై గతంలో వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆయనపై విమర్శలు తగ్గిపోయాయి. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా లక్ష్మీనారాయణ మాత్రం హుందాగానే వ్యవహరిస్తూ ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేసే వారు కాదు. అయితే ఆయనపై ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
“స్వామి వివేకానందునిలా బిల్డప్, సర్వీసులో ఉన్నంత కాలం అధికారంలోకి ఉన్న వారికి ఊడిగం, సీబీఐ అధికారిగా సోనియాకు గులాం, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ను కాపాడతానని బయలుదేరాడు. పోరాడాల్సిన చోట పోరాడడు. అడగాల్సిన వారిని అడగడట. ఉక్కు కోసం తెగిస్తానని చెవుల్లో పెడుతున్నాడు క్యాలీఫ్లవర్” అంటూ లక్ష్మీనారాయణను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ స్పందించలేదు కానీ ఆయన అభిమానులు కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు.