Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక లోకం చేస్తున్న పోరాటం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ విశాఖలో భారీ ప్రదర్శన, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వదద్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు 150వ రోజుకు చేరాయి. జీవిఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు 100వ రోజుకు చేరియ. ఈ సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు పోరాటంలో పాల్గొనాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఓ పక్క రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వంతో సహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. అయినప్పటికే ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేయడంతో కార్మిక లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.