Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. నాయకులు ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ గేటు వద్ద కార్మికులు నిర్వహించిన బహిరంగ సభలో బుధవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, వామపక్షాల నేతలు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని మొదటి నుండి చెబుతున్నామనీ, అయిదు దశాబ్దాల క్రితం పోరాడి సాధించుకున్న ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు అందరం కలిసికట్టుగా పోరాడదామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అభియోగాలు, ఆరోపణలు చేసుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ దారుణ నిర్ణయాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాన మంత్రి మోడికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదనీ, కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమిద్దామన్నారు విజయసాయిరెడ్డి.
ప్రజాభీష్టాన్ని గౌరవించకపోతే కేంద్రంలోని బీజెపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. దక్షిణాది రాష్ట్రాలు దేశంలో భాగమేనన్న విషయాన్ని కేంద్ర పాలకులు గుర్తించాలనీ, జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. ఏపి ప్రజలు ఉద్యమబాట పడితే ఆపడం ఎవరితరం కాదని అన్నారు అవంతి శ్రీనివాస్. ఏపికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తూ తిరుపతి ఎన్నికల్లో బీజెపీ- జనసేన గెలవాలనుకోవడం సాధ్యమేనా అని అవంతి ప్రశ్నించారు.