Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక అనుమానితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డిని సిబీఐ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పులివెందులకు చెందిన శివశంకరరెడ్డి కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణం వల్ల రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లగా సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హత్య కేసులో హత్యకు కారకులుగా భావిస్తున్నవారిని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చడంతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఆధారంగా శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఇచ్చిన అనుమానితుల జాబితాలోనూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ఉంది.
రాజకీయ విభేదాలు, ఆర్ధిక లావాదేవీల వివాదాల నేపథ్యంలో వివేకా హత్య జరిగినట్లు భావిస్తుండగా, కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. హత్యలో నేరుగా పాల్గొన్న వ్యక్తులను అరెస్టు చేయగా, దస్తగిరి చెప్పిన విషయాల్లో రూ.40 కోట్ల సుపారీ వ్యవహారం బయటపడటంతో దానికి ప్రధానకారకుడైన ఎర్ర గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.