Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపి సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుని రేపో మాపో చార్జి షీటు దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు ఇటీవల కాలం వరకూ రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగింది. మూడు పర్యాయాలు కడపలో పలువురు అనుమానితులను విచారించి స్టేట్మెంట్ లను రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. అనంతరం ఈ ఏడాది జూన్ లో మళ్లీ నాల్గవ విడతగా సీబీఐ గత 44 రోజుల నుండి కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు సీబీఐ బృందం కడపలో తిష్ట వేసి విచారణ జరపడం ఇదే తొలి సారి. ఈ 44 రోజుల నుండి ఆరుగురు అనుమానితుల చుట్టే వివేకా కేసులో విచారణ కొనసాగుతోంది. గతంలో ఢిల్లీ కేంద్రంగా కూడా కొనసాగించిన విచారణలోనూ ఈ ఆరుగురు అనుమానితులను విచారించి స్టేట్మెంట్ లను రికార్డు చేసుకున్నారు.
Read More: Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు..! ఎందుకంటే..?
విచారణలో పదేపదే ఆ ఆరుగురు అనుమానితులను మాత్రమే విచారిస్తూ ఉండటం పలు అనుమానాలకు తావు ఇచ్చింది. ప్రధానంగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఎ కృష్ణారెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్ మెన్ రంగయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా తో పాటు మరి కొందరిని విచారించారు. పై అరుగురు అనుమానితులు వివేకా హత్య జరిగిన తర్వాత ఆధారాలు చెరిపివేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా దాదాపు నెలా పదిహేను రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ కొనసాగించడంతో కీలక సమాచారం లభించిందనీ, త్వరలో అరెస్టులు ఉంటాయి, చార్జిషీటు దాఖలు చేస్తారు అనుకుంటున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న డీఐజీ స్థాయి సీబీఐ అధికారిణి సుథా సింగ్ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రాం కుమార్ ను నియమిస్తూ సీబీఐ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశలో ఉండగా విచారణ అధికారి బదిలీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర సంచలన వార్త అయ్యింది. ఇంతకు ముందు జరిగిన సీబీఐ విచారణలో ప్రగతి లేకపోవడంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులను కలిసి దర్యాప్తు వేగవంతం చేయాలని కోరడం, అదే రోజు మీడియా సమావేశంలో దర్యాప్తులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ తరువాతనే సీబీఐ ఉన్నతాధికారులు సుధాసింగ్ నేతృత్వంలో టీమ్ ను కడపకు పంపడంతో ఆమె విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఉన్నతాధికారులు దర్యాప్తునకు నేతృత్వ అధికారి ని బదిలీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా విచారణకు నేతృత్వం వహిస్తున్న అధికారి మళ్లీ మొదటి నుండి దర్యాప్తును ప్రారంభిస్తారా లేక ఇప్పటి వరకూ జరిగిన విచారణ ప్రక్రియనే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.