Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు భావిస్తున్న కొందరు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపింది. అయితే వివేకా హత్యలో కీలక సూత్రధారులను కనుగొనే పనిలో సీబీఐ నిమగ్నమైంది. అయితే ఈ కేసులో శివశంకరరెడ్డిని అరెస్టు చేసిన తరువాత సీబీఐపైనే ఆరోపణలుచేస్తూ కొత్త కొత్త విషయాలను కొందరు వెలుగులోకి తీసుకువచ్చారు. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిపోయి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసు తేల్చే పనిలో సీబీఐ ఉంది. ఈ క్రమంలో భాగంగా ఓ కీలక ప్రతిపాదనతో పులివెందుల కోర్టును ఆశ్రయించింది సీబీఐ. కేసులో నిందితుడుగా ఉన్న శివశంకరరెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను పులివెందుల కోర్టు విచారణకు స్వీకరించింది.
Viveka Murder Case: శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు ..?
నార్కో పరీక్షల నిర్వహణకు గానూ త్వరలోనే నిందితుడు శివశంకరరెడ్డి అంగీకారం కొరకు పులివెందుల కోర్టు నోటీసు జారీ చేయనుంది. శివశంకరరెడ్డి ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో పక్క నిందితులుగా ఉన్న శివశంకరరెడ్డి, ఉమాశంకరరెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు పులివెందుల కోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఇటీవల కోర్టు అనుమతితో శివశంకరరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించింది. విచారణ అధికారులకు శివశంకరరెడ్డి వాస్తవాలు తెలియజేయనందున నార్కో పరీక్షలు చేయాలని సీబీఐ భావిస్తోంది. అయితే ఇటువంటి పరీక్షలు జరపాలంటే సంబంధిత వ్యక్తుల సమ్మతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. శివశంకరరెడ్డి..కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు. కాగా ఇంతకు ముందు నిందితుల్లో మరొకరు సునీల్ యాదవ్ కు నార్కో పరీక్షల నిర్వహణకు కోర్టును సీబీఐ ఆశ్రయించగా, పరీక్షలకు సునీల్ యాదవ్ అంగీకరించకపోవడంతో కోర్టు సీబీఐ అభ్యర్ధనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శివశంకరరెడ్డి నార్కో పరీక్షలకు అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?