Viveka Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చిక్కుముడులు అన్నీ ఒక్కటొక్కటిగా వీగిపోయి కీలకదశకు చేరుకుంది. ఇప్పటికే హత్యకు కారకులైన ప్రధాన నిందితులను అరెస్టు చేసిన సీబీఐ .. హత్య వెనుక సూత్రధారులను పట్టుకునే పనిలో విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా అరెస్టు చేసిన శివశంకరరెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీయల్ విచారణకు తీసుకుంది. మరో పక్క ఈ హత్య కేసులో నాల్గవ నిందితుడుగా ఉన్న షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని మిగిలిన నిందితులు వ్యతిరేకించారు. అయితే వీరి అభ్యంతరాలను సబ్ కోర్టు తోసిపుచ్చింది. షేక్ దస్తగిరిని ముద్దాయి స్థానం నుండి సాక్షి స్థానంలోకి మార్పు చేసి ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేయాలని కడప సబ్ కోర్టు జడ్జి పులివెందుల కోర్టును ఆదేశించారు. దీంతో పులివెందుల కోర్టులో మరో సారి దస్తగిరి నుండి 164 సెక్షన్ కింద వాగ్మూలం రికార్డు చేసే అవకాశం ఉంది.
Viveka Murder Case: ఇక సాక్షిగా మారిన నిందితుడు దస్తగిరి
ఏ 4 నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారుతున్నాడనీ 306 సెక్షన్ కింద సాక్షం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ముగ్గురు నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఇతర నిందితుల తరుపు న్యాయవాదులను తోసిపుచ్చింది. దస్తగిరి అప్రూవర్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. వివేకా హత్య కేసులో అరెస్టు అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ నందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. పులివెందుల కోర్టు శివశంకరరెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ విచారణ సాగుతోంది. శివశంకరరెడ్డి కడప ఎంపి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో సీబీఐ విచారణలో ఆయన ఏమి చెప్పనున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై 29న విచారణ
ఈ హత్య కేసులో మరో నిందితుడు ఏ 1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని 20 రోజుల క్రితం కడప నాల్గవ అదనపు జిల్లా కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరిపి 29వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇక సీబీఐ దస్తగిరి స్టేట్ మెంట్ ను పులివెందుల కోర్టులో రికార్డు చేయించడం, శివశంకరరెడ్డి విచారణలో వెల్లడించే విషయాలతో వివేకా హత్య కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేది సీబీఐ గుర్తించే అవకాశం ఉంది. అదే విధంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు కోర్టు అంగీకరిస్తే..ఆయనను కస్టడీయల్ విచారణ చేసేందుకు సీబీఐ.. కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎర్ర గంగిరెడ్డి నోరు విప్పితేనే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తుంటే మొదట సీబీఐ విచారణపై అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ ప్రస్తుతం దర్యాప్తు సక్రమంగానే సాగుతున్నదన్న అభిప్రాయం మెజార్టీ వర్గాల్లో కలుగుతోంది.