Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన గంగాధరరెడ్డి అనే వ్యక్తి సోమవారం స్పందన కార్యక్రమంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను కలిసి తనకు ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను తప్పుడు సాక్షం చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపించారు. వివేకా అనుచరులతో తనకు ప్రాణ హాని ఉందని, వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వివేకా హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదనీ పేర్కొన్న గంగాధర్ రెడ్డి.. అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లు పది కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పడం వల్ల తాను హత్య చేసినట్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల 24వ తేదీ విచారణకు రావాలని సీబీఐ అధికారులు కబురు చేశారనీ, తప్పుడు సాక్షం చెప్పడం ఇష్టం లేక తాను వెళ్లలేదన్నారు. తనకు ప్రాణ హని ఉన్నందున రక్షణ కోసం ఎస్పీని కలిసి ఫిర్యాదు అందజేసినట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. దీనిపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామన్నారు. సీీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కాగా సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కస్టడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నాల్గవ నిందితుడైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి వాగ్మూంలం ఇచ్చిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన స్టెట్ మెంట్ ఆధారంగా శివశంకరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.