Viveka Murder case: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకున్న తరుణంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో విచారణ బాధ్యతలను స్వీకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తొలుత తూతూ మంత్రంగా కేసు విచారణ చేశారు. పులివెందులకు వచ్చి పది పదిహేను రోజులు ఉండి ఓ పది, 20 మంది విచారించి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ పెద్దలను కలవడంతో పాటు అక్కడ మీడియా సమావేశంలోనూ సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందని ఆరోపించారు. దాంతో సీబీఐలో కదలిక వచ్చింది. ఈ సారి ఏలాగైనా కేసును ఛేదించాలన్న పట్టుదలతో రెండు నెలలకుపైగా కడపలోనే మకాం వేసి దర్యాప్తును వేగవంతం చేశారు. చివరకు ఈ హత్య ఎవరెవరు చేశారు ?. ఎందుకు చేశారు ? అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. ఈ కేసులో నాల్గవ నిందితుడుగా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిపోయి హత్యకు సంబంధించిన విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు సీబీఐ అధికారులకు చెప్పారు.
Viveka Murder case: డ్రైవర్ దస్తగిరి వ్యాంగ్మూలంతో..
దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తరువాత ఆయనను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఇక ఈ హత్య కేసులో సూత్రధారులను కనుగొనే పనిలో సీబీఐ అధికారులు ఉండగా పలు సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని గతంలో సిట్ అధికారులు ఘటనా స్థలంలో సాక్షాధారాలు రూపుమాపారు అన్న అభియోగంపై అరెస్టు చేశారు. అయితే మూడు నెలల వరకూ సిట్ అధికారులు చార్జి షీటు దాఖలు చేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ తరుణంలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ అధికారులు కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సబ్ కోర్టు సిబీఐ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ఎర్ర గంగిరెడ్డి
కడప సబ్ కోర్టులో నుండి ఎర్ర గంగిరెడ్డికి ఊరట నిచ్చేలా కోర్టు తీర్పు రావడంతో 24 గంటల వ్యవధిలోనే గంగిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వివేకా హత్య కేసులో ఎటువంటి సంబంధం లేదనీ, కావాలనే తన పేరు ఇరికించారని ఆయన పేర్కొంటున్నాడు. మరో పక్క వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శివశంకర్ రెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటున్న గంగాధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఒక సీఐ, వివేకా అనుచరులపైనా ఆరోపణలు చేశారు. ఎంపి అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులను కేసులో ఇరికించేందుకు తనను తప్పుడు సాక్షం చెప్పాలనీ ఒత్తిడి చేస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపించారు. మీడియా ముందు ఇవే విషయాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్పీకి ఈ మేరక ఓ లేఖను అందజేశాడు గంగాధర్ రెడ్డి. ఇలా వరుసగా వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.