Vizag Steel : మరోమారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక అప్డేట్ తెరమీదకు వచ్చింది. ఏపీకి ప్రతిష్టాత్మకంగా మారిన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం క్రమంగా ముందుకే అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంటు కు లాభాలు వచ్చే అవకాశాలున్నా.. కేంద్రం అమ్మేయడానికి సిద్దపడిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నెత్తి నోరూ బాదుకుని చెబుతూనే ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం తాను అనుకున్న దారిలోనే వెళ్తోంది. ఇప్పుడు మరోసారి ఇదే అంశం తెర మీదకు వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహరం ఓవైపు జరుగుతున్న సందర్భంలో కేంద్రంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఏపీకి కీలకం కానున్నాయి.
విశాఖ ఉక్కు … కాదు ఆంధ్రుల హక్కు
గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాశారు.. ఆ లేఖకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఠాకూర్ తాజాగా లేఖ రాశారు. ఉక్కు ప్రైవేటీకరణతో అందరికీ మంచే జరుగుతుందని లేఖలో తెలిపిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని వివరణ ఇచ్చారు. ఉక్కు సంస్థలో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని లేఖలో స్పష్టం చేసిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణవల్ల అంతా మంచే జరుగుతుందని, ఉత్పత్తి పెరుగుతుందని, అందులో పనిచేసే ఉద్యోగులు, భాగస్వామ్య పక్షాలకు న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
కేంద్రం మొండి వైఖరి
విశాఖ స్టీల్ ప్లాంటు కు లాభాలు వచ్చే అవకాశాలున్నా.. కేంద్రం అమ్మేయడానికి సిద్దపడింది. స్టీల్ ప్లాంట్ పూర్తిగా అప్పుల్లో ఉంది. పూర్తి స్థాయి నష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోయలేదు.. భరించ లేదు. కాబట్టి స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నామని కేంద్రం అదే పనిగా చెప్పుకుంటూ వస్తోంది. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావడం ఖాయమని ప్లాంట్ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరి లెక్కలు చూసి స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించుకుందో వారి లెక్కలే ఇప్పుడు ప్లాంట్ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెబుతున్నాయి. ఐదేళ్ల నష్టాలు.. పెండింగులో ఉన్న పన్నుల బకాయిలని చెల్లించాక కూడా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని తాజాగా ఓ ఆర్టీఐ దరఖాస్తులో ఆర్ఐఎన్ఎల్ స్పష్టంగా చెప్పేసింది. దీంతో కేంద్రం చెప్తున్న మాట బూటకమని పలువురు కామెంట్ చేస్తున్నారు.