G20 Summit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జీ20 సదస్సులో పాల్గొన్నారు. గన్నవరం నుండి విశాఖపట్నంకి మొదట విమానంలో బయలుదేరాలని వచ్చిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపంతో చాలాసేపు గన్నవరం విమానాశ్రయంలోనే నిలిచిపోయారు. ఆ తర్వాత మరో విమానంలో విశాఖకు చేరుకోవడం జరిగింది. విశాఖపట్నం విమానాశ్రయంలో స్థానిక వైసీపీ నేతలు సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ సదస్సుకు వచ్చిన అతిథులతో కలిసి జగన్ విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జి-20 రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. 22 లక్షల మంది పేదలకు ఇల్లు కడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. సరైన చర్చలు జరిపి.. మంచి ఆలోచనలు సూచనలు ఇవ్వాలని కోరారు.
దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దీనివల్ల చాలామంది పేదలకు మంచి చేకూరుతుంది. కాబట్టి దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని.. సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో 69 విదేశీ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. జీ20 సదస్సు నేపథ్యంలో విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.