Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రంలో అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,020 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ సాయంత్రానికి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మాండూన్ తూఫానుగా బలపడి రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని చెప్పింది.
మాండూస్ తుఫాను 9వ తేదీన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫానుగానైనా లేక బలహీనపడి వాయుగుండం గానైనా తీరం దాటిన తర్వాత ఇది చిత్తూరు వైపు కదులుతూ క్రమంగా బలహీన పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 8,9,10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలపై పడనుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
ఈ నెల 7వ తేదీ (గురువారం) నుండి పదవ తేదీ వరకూ గంటకు 50 నుండి 60, అప్పుడప్పుడు 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి వచ్చేయాలని ఆయన సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కచ్చా ఇళ్లకు నష్టం వాటిల్లుతుందని, విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలుగుతుందని, చెట్లు కూలే ప్రమాదం ఉందనీ, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్: ఆప్, బీజేపీ హోరాహోరీ