Guntur: గుంటూరు పై గంపెడాశలు పెట్టుకున్న టీడీపీకు చుక్కల చూపించడంలో జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యూహం ఉంది అనేది అధికార పార్టీలో సాగుతున్న చర్చ. ఆయన మొదటి నుంచి గుంటూరు పై ప్రత్యేక దృష్టి నిలిపి, ఒక వ్యూహం ప్రణాళిక ప్రకారం వెళ్లడంతో నే గుంటూరు కార్పొరేషన్ లో వైకాపా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అని తెలుస్తోంది.
Guntur ఎంపిక నుంచి ప్రచారం వరకూ
జిల్లా ఇన్చార్జి మంత్రి ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకోరు. అయితే ముఖ్యమంత్రి జగన్ గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ కు ప్రత్యేక టాస్క్ ఇచ్చారు.
దీంతో ఆయన పక్కా ప్రణాళికతో అభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి, ప్రచారం వరకు ప్రతి బాధ్యతను భుజాన వేసుకుని ముందుకు కదిలారు. ఆయన సొంత జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మొత్తం చూసుకుంటే, శ్రీ రంగనాథ రాజు గుంటూరు మీద పూర్తి దృష్టి పెట్టారు.
** మొదట గుంటూరు కార్పొరేషన్ డివిజన్ల వారీగా పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి వ్యక్తిగతంగా ఆయా అభ్యర్థుల వివరాలను, డివిజన్లో వారికున్న బలాబలాలను అంచనా వేశారు. ఎవరు గెలుపు గుర్రమో పూర్తిగా పరిశీలించి టికెట్లు కేటాయించారు. పార్టీకి వారు ఎంత విధేయత గా ఉంటున్నారు అన్నది ప్రత్యేకంగా మంత్రి పరిశీలన చేయడంతోపాటు రహస్యంగా వివరాలు సేకరించడం తో అభ్యర్థుల పూర్తి వివరాలు బయటకు వచ్చాయి.
** సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. ఆయా డివిజన్ లో ఎవరైతే ప్రభావితం చేయగలరు అన్న దానిని ఆరా తీసి, ఆయా డివిజన్లోని నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా డివిజన్లలోని నాయకులందరినీ పిలిచి మాట్లాడి వారిని యాక్టివ్ రోల్ పోషించేలా ప్రోత్సహించారు.
** మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ముందుగా ప్రకటించక పోవడం వెనుక కూడా ఇన్చార్జి మంత్రి వ్యూహం ఉంది. ముందుగా అభ్యర్థిని ఎంపిక చేస్తే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు మిగిలిన వారు అంత ఆసక్తిగా ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని తేలడంతో మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ముందుగా ప్రకటించలేదు. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి అన్నది అభ్యర్థులు చెప్పడం లో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డివిజన్ల వారీగా ప్రచారం చేయించడం లోనూ చెరుకువాడ తన మార్క్ ప్రణాళిక బయట పెట్టారు.
మేయర్ ఎవరో??
57 వార్డులు ఉన్న గుంటూరు నగరపాలక సంస్థ లో వైకాపా 44 వార్డు గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఇప్పుడు మేయర్ ఎవరు అనేదానిమీద ఉత్కంఠ ఎదురవుతోంది. మేయర్ పీఠం జనరల్ గా ఉండడంతో అందరూ దీని మీద ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు నుంచే కావటి మనోహర్ నాయుడు, ఫాదర్ టి రమేష్ గాంధీ ల పేర్లు మేయర్ రేసులోకి వచ్చాయి.
** మనోహర్ నాయుడు అంతకు ముందే రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ప్రస్తుతం మంచి మెజారిటీతో మూడోసారి కార్పొరేటర్ గా గెలిచారు. ఆయనకు రాజకీయ అనుభవం ఉండడంతో పాటు, మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నారని పేరు ఉంది. ఇక రెండో పేరుగా ఉన్న పాదర్తి రమేష్ గాంధీ పార్టీ నగర అధ్యక్షుడు గా పనిచేస్తున్నారు. ఆయనకు పార్టీ పెద్దల సహకారం ఉంది.
గుంటూరులో పార్టీని పటిష్టం చేయడానికి పని చేశారు. కావటి మనోహర్ నాయుడు కు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశీస్సులు ఉన్నాయని, అలాగే పాదర్తి రమేష్ గాంధీ కు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అండ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పార్టీ అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని, దీనిలో మరో మాట ఉండదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.