ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోనూ ఏర్పాటు చేయనున్నారంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో వార్తలు రావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జగనే పార్టీ పెట్టిస్తున్నారా లేక ఆమె సోదరి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారో తెలియదు కానీ ఓ ప్రముఖ ఛానల్ లో దీనిపై కథనం రావడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. అందులో వాస్తవం ఉందో లేదో కానీ విస్తృతంగా చర్చ మాత్రం జరుగుతోంది.
తెలంగాణలో షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు మీడియాలో వస్తున్న కథనాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడుగా తాను తప్ప ఎవరూ ఉండకూడన్న భావన జగన్మోహనరెడ్డిది అని అన్నారు. షర్మిలలో ప్రవహిస్తున్నదీ వైఎస్ఆర్ రక్తమేననీ అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నారేమో అని అభిప్రాయపడ్డారు హనుమంతరావు. షర్మిలకు గత ఎన్నికల్లో వైజాగ్ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని విహెచ్ సంచలన ఆరోపణ చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనీ, ఒక వేళ పార్టీ పెట్టదలిస్తే ఏపిలో పెట్టడమే మేలని కూడా సలహా ఇచ్చారు వీహెచ్. తెలంగాణలో అధికార పార్టీకి ధీటుగా బీజెపీ, కాంగ్రెస్ ఉన్నాయి. అదే ఆంధ్రలో అయితే జగన్ వ్యతిరేకులు అంతా షర్మిల వెంట నడుస్తారని విహెచ్ చెప్పారు. జగన్ మీద కోపం ఉంటే షర్మిల ఏపిలోనే పార్టీ పెట్టుకోవాలంటూ ఓ ఉచిత సూచన చేశారు విహెచ్.
ఆంధ్రప్రదేష్ టీడీపీ నేత పట్టాభి కూడా షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారు అన్న విషయంపై తమకు సమాచారం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల రాజకీయ పార్టీ పెట్టే అంశంపై సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు స్పందించడంతో తెలంగాణలో ఈ వార్త సంచలనంగా మారింది. తెలంగాణలోని జిల్లాల్లో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే అక్కడి కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారడంతో వైఎస్ఆర్ అభిమానులు చాలా మంది అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు. గత ఎన్నికల ముందు నుండి ఇటీవల కాలం వరకూ టీఆర్ఎస్ అధినేత సీఎం కెసిఆర్ తో జగన్ కు స్నేహసంబంధాలు ఉండటం వల్లనే తెలంగాణలో వైసీపీ ని బలోపేతం చేయాలని జగన్ భావించడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జల వివాదాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే తెలంగాణలో వైసీపీ పార్టీ అంటూ వార్తలు వస్తున్నాయని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై ఇంకా ఎందరు నాయకులు స్పందిస్తారో చూడాలి మరి.