KTR : ఇప్పటికే విశాఖ ఉక్కు ఉద్యమం మీద కీలకమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ త్వరలోనే విశాఖ వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన విశాఖ ఉద్యమం వేదికగా రాష్ట్రంలో ఏమైనా రాజకీయ సమీకరణాలు మార్చే ప్రయత్నం చేస్తారా అన్న వాదన వినిపిస్తోంది.
** ఉద్యమాల పార్టీగా ఉన్న టిఆర్ఎస్ విశాఖ ఉక్కు ఉద్యమం మీద కూడా తాము పోరాడుతామని ప్రకటించడం ద్వారా విశాఖ ఉక్కు సంఘాల మద్దతు కూడగట్టుకుంది. రాష్ట్ర నాయకులు ఎవరూ నోరెత్తని సమయంలో కేటీఆర్ తెలివిగా ఆ ప్రకటన చేయడంతో కార్మిక సంఘాల మద్దతును చూరగొన్నారు. బీజేపీతో కయ్యానికి సిద్ధంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ విశాఖ ఉక్కు ఉద్యమం లో ఆంధ్ర నాయకుల తీరును గమనించి ఈ వ్యాఖ్యలు చేసింది అన్నది బహిరంగ వాస్తవం.
** కేటీఆర్ త్వరలో వైజాగ్ వచ్చి విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటే కనుక ఆయన చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అన్నది కీలకం కానుంది. అధికార పార్టీ మీద విరుచుకు పడతారా లేక ప్రతిపక్షాల కుట్ర అంటూ కొత్త విషయం ఏమైనా బయట పెడతారా అన్నది కీలకం కానుంది. దీంతో రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు కేటీఆర్ రాక మీద పడ్డాయి.
** కేటీఆర్ విశాఖ వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆంధ్ర నాయకులకు అంత సీన్ లేదంటూ వ్యాఖ్యలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ నాయకులకు చిన్న చూపే. ఒకవేళ కేటీఆర్ తమది ఉద్యమపార్టీ గా చెప్పుకొని కేంద్రంతో పోరాడగల సత్తా తమకుందని చెప్తే, ఉద్యమాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎలా భుజానికి ఎత్తుకుంతుంది అన్నది కూడా కీలకం అవుతుంది.
** టిడిపి నాయకుడు గంటా శ్రీనివాస రావు కేటీఆర్ దగ్గరికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి ఆయన మద్దతు కోరినప్పుడు, ఖచ్చితంగా ఇది మా దృష్టికి వచ్చిన సమస్యని విశాఖ వచ్చి అందరితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా ఆంధ్ర రాజకీయాలలో సైతం టీఆర్ఎస్ ను ప్రవేశ పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా అనే అనుమానం సైతం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ఉద్దేశం కేసీఆర్కు ఉన్నట్లే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.