Chandrababu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఇలాకా అయిన కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజక వర్గంలోని మెజారిటీ గ్రామపంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలకు సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజక వర్గంలో రౌడీయిజాన్ని జరగనివ్వమని, పుంగనూరు, పులివెందులలో ఓటువేసి పరిస్థితి లేకుండా చేస్తున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి బాబు విమర్శించారు. అయితే ఈ టూర్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Chandrababu చంద్రబాబు దమ్ముంటే పోటీ చెయ్…
చంద్రబాబు కుప్పం పర్యటనలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పుంగనూరు ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి బాబుకు ఓ సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరు నుంచి పోటీ చేయాలని అన్నారు. కుప్పంలో ఓడిపోయినా బాబుకు కనువిప్పు కలగలేదని, ఇప్పుడు పుంగనూరు, పులివెందుల వచ్చి ఏం చేస్తారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నారని సంక్షేమ పాలనవైపుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
అంబటి అదిరిపోయే కామెంట్స్…
జగన్ వల్లే చంద్రబాబు కుప్పం గల్లీలు పట్టుకుని తిరుగుతున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి చంద్రబాబుకు వచ్చిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు నీళ్లు ఇమ్మని జగన్ ను అడుగుతున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని అడుగుతున్నారని.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప కుప్పంలో ప్రచారానికి టీడీపీకి దిక్కు లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉండి కూడా మ్యానిఫెస్టో అమలు చేయలేకపోయిన చంద్రబాబు… ప్రతిపక్షంలో ఈ కొత్త మ్యానిఫెస్టో ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. లోకేష్ వచ్చిన తర్వాతే సైకిల్ తునాతునకలు అయిందని.. జగన్మోహన్ రెడ్డి గన్ లో బుల్లెట్ లేకపోతేనే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడా? అని పేర్కొన్నారు. గన్ లో బుల్లెట్ లేకపోతేనే టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యిందా? తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆక్రోశం లోకేష్ లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.